TDP Vs YCP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ఏపిలో పరిణామాలపై టీడీపీ, వైసీపీ ఎంపిలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేశారు. హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి హజరు అయిన హోంశాఖ మంత్రి అమిత్ షా తో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితర ఎంపిలు వేరువేరుగా కలిసి మాట్లాడారు. ఏపిలో పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. టీడీపీ, చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరు. టీడీపీ కార్యాలయంపై దాడి తదితర విషయాలను, చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన విషయాలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల వివరించారు. ఇదే సందర్భంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా అమిత్ షాతో మాట్లాడారు. దీన్ని పురస్కరించుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ అమిత్ షాను సుజనా చౌదరి ప్రాధేయపడ్డారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చూస్తుంటే సుజనా చౌదరి ఇంకా పసుపు రంగును వదల్లేదనీ, కాషాయాన్ని ఇంకా వంటబట్టించుకోలేదని తెలుస్తోందన్నారు. సుజనా నేటికీ తన రియల్ బాస్ కోసమే పని చేస్తున్నట్లు నిరూపితమైందని విజయసాయి ట్వీట్ చేస్తూ అమిత్ షా పక్కనే సుజనా చౌదరి నడుస్తున్న ఫోటోను షేర్ చేశారు.
TDP Vs YCP: అమిత్ షాను కలిసిన గోరంట్ల మాధవ్, కనకమేడల
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల..అమిత్ షాకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంలో చంద్రబాబుకు త్వరలో అపాయింట్ మెంట్ ఇస్తానని కనకమేడలకు హామీ ఇచ్చారని సమాచారం. ఏపి పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. కాగా హిందూపూర్ వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫిర్యాదు అందజేశారు. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడికి గల కారణాలు, రాష్ట్రంలో టీడీపీ వ్యవహరిస్తున్న వైఖరిపై అమిత్ షాకు పలు అధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన చేస్తానని తనకు అమిత్ షా హామీ ఇచ్చినట్లు మాదవ్ తెలియజేశారు.
వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు పట్టాభి ఇంటిపై, టీడీపి కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. దీనికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేయడంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. పీఎం మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు లభించకపోవడంతో వారిని కలవకుండానే చంద్రబాబు తిరుగు ప్రయాణం అయ్యారు. పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?