TDP Vs YCP: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ, వైసీపీ విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం మున్సిపాలిటినీ ఇరు పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఎలాగైనా కుప్పంలో వైసీపీని ఓడించి చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వాలని వైసీపీ పట్టుదలతో ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వ్యూహాత్మకంగా వైసీపీ వ్యవహరిస్తోంది. టీడీపీ సైతం ఎలాగైనా గెలుచుకుని పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. సోమవారం పోలింగ్ సందర్భంగా కుప్పంలో పలు వార్డుల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసులు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఏజంట్ లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారని చంద్రబాబు సైతం ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీపై ఎస్ఈసీకి వైసీపీ నేత ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీ నీలం సాహ్నికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తిలు ఫిర్యాదు చేశారు.
Read More: Chandra Babu: జగన్ సర్కార్పై ఇన్ని కుట్రలా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..!!
TDP Vs YCP: ఓటమి భయంతోనే ప్రలోభాలు
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్, జడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలు దిగజారుస్తున్నారని విమర్శించారు. కుప్పంలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, పులివర్తి నాని దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. కుప్పం పర్యటనలో నారా లోకేష్ న్యాయస్థానాల విలువలను దిగజార్చే విధంగా వ్యాఖ్యానాలు చేశారన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.
కుప్పంలో ఓటు లేని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు వెళుతున్నారని అప్పిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంలో ఓటరే కాదనీ, నారా వారి పల్లెలోనూ ఆయనకు ఓటు లేదని అన్నారు. దొంగ ఓట్లు వేయించే సంస్కృతి టీడీపీదేననీ అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఏరియాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని అప్పిరెడ్డి విమర్శించారు. పలు ఆధారాలతో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసికి ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.