Narayana Arrest: పదవ తరగతి పశ్నా పత్రాల లీకేజీ కేసులో ఏపి సీఐడీ అధికారులు టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు హైదరాబాద్ లో నారాయణను అదుపులోకి తీసుకున్న క్రమంలో తాను కూడా వెంట వస్తానంటూ నారాయణ సతీమణి ఆయన కారులో బయలుదేరారు. అయితే సీఐడీ పోలీసులు కొత్తూరు వద్ద ఆమెను వదిలివేశారు. నారాయణ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు పలువురు ఖండించారు. ప్రభుత్వ చర్యను తప్పుబడుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో సీఐడీ చర్యలను వైసీపీ ప్రభుత్వ పెద్దలు మంత్రులు సమర్ధిస్తున్నారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కుట్ర నారాయణ విద్యాసంస్థల కేంద్రంగానే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో తిరుపతిలోని నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మాజీ మంత్రి నారాయణ ప్రోద్బలంతోనే పేపర్ లీక్ చేసినట్లు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గిరిధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే ఏపి సీఐడీ నారాయణను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, కృష్ణారెడ్డి, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల్లో పని చేస్తున్న వారని సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Narayana Arrest: నారాయణ అరెస్టుపై ఎవరు ఎమన్నారంటే..
చంద్రబాబు, టీడీపీ అధినేత: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యమై అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ ప్రభుత్వం.. జీర్ణించుకోలేక ఈ తరహా కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడు చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఆధారాలు లేకుండా నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా అని మండిపడ్డారు. నారాయణను జైలులో పెట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అక్రమ కేసులతో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Narayana Arrest: రాజకీయ కక్షసాధింపులో భాగంగానే
నారా లోకేష్: చేతగాని తనాన్ని ఇతరులపై నెట్టేయడం, చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చేయడం జగన్ అండ్ కో ట్రేడే మార్క్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని లోకేష్ అన్నారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అదుపులోకి తీసుకోవడాన్ని లోకేష్ ఖండించారు. టెన్త్ పరీక్షా పత్రాల లీక్ ఘటనపై మంత్రి బొత్స, సీఎం జగన్ విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశారని అన్నారు. ఈ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలను అరెస్టు చేయించి సీఎం సైకో ఆనందం పొందొచ్చు కానీ..పరీక్షలు రాసిన విద్యార్ధులకు ఎలాంటి మేలూ జరగదని అన్నారు.
విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్టు చేస్తారా?
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేయడంపై సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నారాయణ విద్యాసంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా అని ప్రశ్నించారు. ఆరు లక్షల మందికిపైగా విద్యార్ధులు, 60వేల మందికి ఉద్యోగులతో దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారనీ, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత విద్యాసంస్థల బాధ్యతలను ఆయన పూర్తిగా వదిలివేశారని సోమిరెడ్డి చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. విద్యాశాఖలో లీకేజీపై ఆ శాఖ మంత్రిని కూడా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాలని హితవు పలికారు సోమిరెడ్డి.
విద్యాసంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారు
పత్తిపాటి పుల్లారావు: ప్రశ్నా పత్రాల లీకేజీనే జరగలేదని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్టు చేసిందని విమర్శించారు. విద్యార్ధులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారని పుల్లారావు అన్నారు. అక్రమ కేసులతో ఈ విద్యాసంస్థలను దెబ్బతీస్తే విద్యార్ధులు నష్టపోతారని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
నారాయణ స్కూల్ సిబ్బందే ప్రశ్నా పత్రాలను బయటకు పంపారు
బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి: ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను దర్యాప్తులో భాగంగానే ఏపి సీఐడీ అరెస్టు చేసిందని తెలిపారు. నారాయణ స్కూల్ సిబ్బందే పదవ తరగతి ప్రశ్నా పత్రాలను బయటకు పంపారని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 60 మందిని అరెస్టు చేశామన్నారు. రాజకీయ విమర్శలు ఆపి తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పాలన్నారు.
Narayana Arrest: ప్రాధమిక ఆధారాలు ఉన్న తర్వాతే అరెస్టు
అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి: ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రమేయం ఉందని ప్రాధమిక ఆధారాలు ఉన్న తర్వాతే అరెస్టు ఏపి సీఐడీ అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. నారాయణ అరెస్టుపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. ఆధారాలతో సహా అరెస్టు చేస్తే దీనిపై టీడీపీ గందరగోళం ఏమిటో అర్ధం కావడం లేదని అన్నారు. లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే, రాష్ట్రంలో జరిగే చాలా విషయాల్లో ఇలానే చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి లీక్ ల వల్లనే నంబర్ వన్ ర్యాంక్ వస్తుందని ఆరోపించారు. విచారణ తర్వాతే నారాయణను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ స్టేట్ మెంట్ తర్వాతే విషయం బయటకు వచ్చిందన్నారు.
మాల్ ప్రాక్సీస్ జరిగింది నారాయణ విద్యాసంస్థల్లోనే
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే ఈ ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్సీస్ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 60మందిని అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అందులో పూర్తి విచారణ జరిగాకే ఇప్పుడు నారాయణను అరెస్టు చేశారని అన్నారు పెద్దిరెడ్డి. ఇందులో ఎలాంటి కక్షసాధింపు లేదు, విచారణలోనే అంతా తేలింది. వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పారు.