పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో రణరంగంగా మారింది. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేసుకున్నారు. ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు రింగ్ రోడ్డు సెంటర్ వద్ద ప్రదర్శన చేపట్టారు. ఇదే క్రమంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. చిన్న కాన్వెంట్ వద్ద టీడీపీ ప్రదర్శన చేరుకోగా ఇరువర్గాల పోటాపోటీ నినాదాలు కవ్వింపు చర్యల నేపథ్యంలో రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిిలిపివేసి అక్కడ నుండి వెళ్లిపోవాలంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడ నుండి బలవంతంగా పంపించి వేశారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పలు కార్లను ధ్వంసం చేశారు. మాచర్ల టీడీీప అధ్యక్షుడు కొమర దుర్గారావు కారును తగులబెట్టారు. ఈ ఘటనలతో మాచర్ల రణరంగంగా మారింది. మరో పక్క మాచర్ల లో హింసపై టీడీపీ అదినేత చంద్రబాబు స్పందిస్తూ డీజీపీకి ఫోన్ చేసి పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మాచర్లలో జరిగిన దాడులపై చంద్రబాబు, నారా లోకేష్ సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఫ్యాక్షన్ నేరచరిత్ర ఉన్న వాళ్లే దాడులకు తెగబడ్డారు
కాగా ఈ ఘటనలపై పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ స్పందిస్తూ .. వెల్దుర్తి కి సంబంధించిన ఫ్యాక్షన్ నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారని ముందస్తు చర్యలల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుండే అక్కడ కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం జరిగిన ఇదేమి కర్మ రా బాబు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులే ఉద్దేశం పూర్వకంగా సమీప ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పూర్తిగా ఫ్యాక్షన్ కు సంబంధించిన గొడవకు రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయనీ తెలిపారు. దాడులకు పాల్పడిన వాళ్లందర్నీ అదుపులోకి తీసుకుంటున్నామనీ, ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఎస్పీ రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం మాచర్లలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే
మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు, గురజాల, నర్సరావుపేట ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మాచర్లలో రాళ్లతో, బరిసెలతో, మోటారు బైకుల మీద పక్కా పథకం ప్రకారం సామాన్య ప్రజలమీద దాడిచేసింది ఎవరు? అని ప్రశ్నించారు. నేరుగా మాచర్ల టీడీపీ ఇన్ఛార్జే ఈ విధ్వంసంలో సూత్రధారి, పాత్రధారి అని, ఇది చంద్రబాబుకు తెలిసే జరిగిందని అన్నారు. ఎందుకంటే.. ఇటీవలే మాచర్ల సహా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అక్కడి వారిని ఎంతగా రెచ్చగొట్టాడో, దాడులు చేయాల్సిందిగా బహిరంగ సభల్లోనే ఎలాంటి సందేశం ఇచ్చాడో అందరికీ తెలుసునని అన్నారు. కాబట్టి మాచర్లలో ఇదేం ఖర్మ అంటూ బాబు మనుషులు వస్తుంటే.. స్థానిక ప్రజలు జగనన్న పరిపాలనలో తమకు మేలే జరిగిందని, స్కీంలు- అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా అందాయని చెప్పడంతో తట్టుకోలేని టీడీపీ నాయకులు ఒక పథకం ప్రకారమే మాచర్లలో దాడికి దిగారన్నారు. అంతేకాక ప్రజలను కలవడానికి వెళ్తున్న ఏ నాయకుడైనా కత్తులు, రాడ్లు, బరిసెలు తీసుకుని వెళ్తారా? అని ప్రశ్నించారు. సామాన్య ప్రజలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసిన తర్వాత దాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకుంటే, ఎల్లోమీడియా దీన్ని మరో రకంగా చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని విమర్సించారు. మాచర్ల ఘటనకు బాధ్యులైన టీడీపీ నాయకులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను కోరుతున్నామన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?