TDP Youth: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ అధినేత చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. టీడీపీ వర్గాల్లో, ఇతర మీడియా వర్గాల్లో ఈ టాపిక్ హైలెట్ అయ్యింది. 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని చంద్రబాబు అన్నారు. నిజానికి ప్రస్తుత టీడీపీ పరిస్థితుల్లో 40 శాతం టికెట్లు యువతకు ఇవ్వడం కొంత టఫ్ టాస్కే. ఎందుకంటే..? ప్రస్తుతం టీడీపీలో ఉన్న నాయకత్వం సరాసరిన వయసు చూసుకుంటే 50 నుండి 55 సంవత్సరాలు. వాస్తవానికి యువత అంటే 18 నుండి 35 సంవత్సరాలు. అయితే రాజకీయాల్లో 25 నుండి 40 సంవత్సరాల వయసు వరకూ యువతగా పరిగణించవచ్చు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారం 175 స్థానాల్లో 70 సీట్లు యువతకు ఇవ్వాలి. ఇంత మంది యువతకు టీడీపీ సీట్లు ఇవ్వడం కష్టతరమే. టీడీపీ లో 40 సంవత్సరాలకు అటు ఇటుగా ఉన్న వాళ్లను చూసుకుంటే..అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్, జేసి సోదరుల కుమారులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం నుండి ఇద్దరు భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, కడప జిల్లా నుండి ఇద్దరు బిటెక్ రవి, పుత్తా నర్శింహారెడ్డి కుమారుడు లక్ష్మారెడ్డి ఇలా వీరు ఏడుగురు కనిపిస్తుండగా, నెల్లూరు జిల్లాలో యువ నాయకులు కనిపించడం లేదు. మాజీ మంత్రి నారాయణ కుమార్తె రాజకీయాల్లోకి వస్తే పరిశీలించవచ్చు. కర్నూలు నుండి టీడీ భరత్, చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, కందుకూరు ఇన్ చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఇలా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 15 నుండి 20 పేర్లు వస్తాయి. ఈ పరిస్థితుల్లో 70 సీట్లు ఎలా ఇవ్వగలరు అనేదే పెద్ద ప్రశ్న.
TDP Youth: ప్రకాశంలో అంతా 50యేళ్ల పైబడిన నాయకులే
ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకుల సగటు వయసు చూసుకుంటే ..ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, కొండపి నియోజకవర్గం స్వామి, సంతనూతలపాడు విజయ్ కుమార్, పర్చూరు నియోజకవర్గం ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్ వీరందరి వయసు సుమారు 50సంవత్సరాలు. దర్శి పమిడి రమేష్ 42 – 43 సంవత్సరాలు ఉంటుంది. తరువాత నారాయణరెడ్డి 50 యేళ్లపైనే, అశోక్ రెడ్డి, ఉగ్రనర్శింహారెడ్డి వయసు సుమారు 50యేళ్లు ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలను చూసుకుంటే కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు మాత్రమే 40 సంవత్సరాల లోపు ఉంటాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో కోడెల శివప్రసాద్ కుమారుడికి మత్రమే సుమారు 40 ఏళ్లు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఏలూరు బడేటి చండి, గన్ని వీరాంజనేయులు సుమారు 50 ఏళ్ల పైబడినవారే. ఈ జిల్లాలోనూ 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారిలో ఉండి ఎమ్మెల్యే రామరాజు మాత్రమే ఉన్నారు.
40 శాతం యువతకు సీట్లు కష్టతరమే
ఈ పరిస్థితిలో చంద్రబాబు ఏ రకంగా 70 మంది యువతకు టికెట్లు ఇవ్వగలరు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలలో 40 సంవత్సరాల లోపు వాళ్లు 20 మందికి మించి కనబడటం లేదు. చంద్రబాబు చెప్పినట్లు 40 శాతం యువతకు ఇవ్వాలంటే సీనియర్ లను పార్టీకి ఉపయోగించుకుని కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. వాస్తవానికి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే. 1983లో టీడీపీ తరపున పోటీ చేసిన వాళ్లలో చాలా మంది యువతే. ఆనాడు అయ్యన్నపాత్రుడు, కోడెల శివప్రసాద్, తమ్మినేని సీతారామ్, కరణం బలరాం వంటి నాయకులు అందరూ 35 – 40 ఏళ్ల వయసులో ఉన్నారు. ఇప్పుడు ఆ విధంగా యువతకు సీట్లు కేటాయించడం టీడీపీకి కష్టతరమే అని చెప్పవచ్చు.