TDP YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు, మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ శ్రేణుల కేసుల ఆట కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ప్రారంభమైన కేసుల నమోదు ఇప్పుడు గుంటూరు జిల్లాకు చేరుకుంది. గుంటూరు పట్టణంలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్ 440 కే వైరస్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయబ్రాంతులను గురి చేశాయని ఫిర్యాదు ఫిర్యాదులో న్యాయవాది అనిల్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు చంద్రబాబుపై కేసును రిజిస్టర్ చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు మంత్రి సీదిరి అప్పలరాజుపై అదే పోలీస్ స్టేషన్ లో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ న్యాయవాది కాలే దేవదాసుతో కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్ 440 కే వైరస్ వచ్చిందనీ, అది ప్రమాదకరమైందని టీవీ డిబేట్ లో మాట్లాడరని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే వ్యాఖ్యలపై ఇరు పార్టీల నేతలు ఒక పక్క చంద్రబాబుపై, మరో పక్క మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. అయితే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో పక్క మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదుకు ఉన్నతాధికారుల నుండి అనుమతి రావాల్సి ఉంటుంది. రెండు పార్టీలు ఇలా ఫిర్యాదులు చేసుకోవడం పోలీసులకు పరీక్షగా మారింది.
రాష్ట్రంలో ఓ పక్క కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇరు పార్టీలకు చెందిన వారు కేసు, కౌంటర్ కేసులు పెట్టుకోవడం ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తొలుత కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై కేసు నమోదు చేయడంతో టీడీపీ శ్రేణులు అదే పోలీస్ స్టేషన్ లో మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అదే జిల్లా ఎమ్మిగనూరులోనూ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ కేసుల ఆట ఎంత కాలం కొనసాగుతుందో, దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారో, పోలీసు ఉన్నతాధికారులు వీటిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.