Teacher Forcibly Marries : ఇంకా పలు ప్రాంతాల్లో చదువుకున్న విద్యావంతులూ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా మూఢ నమ్మకాల మాయలో పడి సమాజంలో చీత్కారానికి గురి అవుతున్నారు. ఇటువంటి సంఘటన ఒకటి పంజాబ్ లోని జలంధర్ లో ఇటీవల జరిగింది.
విషయంలోకి వెళితే…బస్తీ బావా ఖేల్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలికి వయసు పైబడుతున్నా వివాహం కావడం లేదు. వచ్చిన సంబంధాలు అన్నీ ఎదో ఒక కారణంతో వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీంతో ఆమె, ఆమె కుటుంబ సభ్యుడు ఓ జోతిష్యుడిని ఆశ్రయించారు. ఆ జ్యోతిష్యుడి ఆమె జాతకాన్ని పరిశీలించి మంగళ్ దోషం ఉందనీ, అది పోవాలంటే ముందుగా ఓ బాలుడిని వివాహం చేసుకోవాలని సూచించాడు. అయన చెప్పింది నిజమేమోనని భావించిన ఆ ఉపాధ్యాయురాలు తన వద్దకు ట్యూషన్ కు వచ్చే 13 ఏళ్ల బాలుడితో తాళి కట్టించుకోవాాలని భావించింది. ఇందు కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. బాలుడికి వారం రోజుల పాటు క్లాస్ లు తీసుకోవాల్సి ఉందనీ, ఆ వారం రోజులు తమ ఇంట్లోనే బాలుడు ఉంటాడని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించింది. ఆ తరువాత ఉపాధ్యాయురాలి కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి పెళ్లి కార్యక్రమం జరిపించారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత బాలుడినిన ఇంటికి పంపి ఆ టీచర్ తన గాజులు పగులగొట్టి వితంతువుగా మారింది.
అయితే ఇంటికి వెళ్లిన ఆ బాలుడు టీచర్ తనతో తాళి కట్టించుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్ పిలిపించి అరెస్టు చేశారు. వివాహం అవ్వాలంటే ఇలా చేయాలని జ్యోతిష్యుడు చెప్పడం వల్లనే తాము చేశామనీ, దీనిలో తమకు వేరే దురుద్దేశం లేదనీ వారు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకోవడంతో ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు తమ ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు.