Telangana : తెలంగాణలో ఉత్కంఠను రేకెత్తించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్రావు ఓటమి పాలయ్యారు. అయితే, ఈ ఓటమి నేపథ్యంలో బీజేపీ నేతల గురించి కొత్త చర్చ జరుగుతోంది.
Telangana : ఆది నుంచి అదే టెన్షన్…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల విషయంలో సుధీర్ఘంగా జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్, ఎలిమినేషన్, ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఒకింత టెన్షన్ పుట్టించింది. టీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై 11 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలిమినేషన్.. ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగా టీఆర్ఎస్కు రావడంతో వాణిదేవి విజయం సాధించారు.
ఈ విషయం బీజేపీ గమనించాలి…
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దేవి ప్రసాద్ను రంగంలోకి దింపింది. అయితే, విజయం సాధించలేకపోయింది.. కానీ, ఈ సారి ఓట్ల నమోదు నుంచి.. ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు ప్రతీ అంశంలో ప్రణాళికబద్దంగా సాగింది. వ్యూహాత్మకంగా పీవీ కూతురును సీఎం కేసీఆర్ బరిలోకి దింపారు. ఈ ఎత్తుగడ వర్కౌట్ అయ్యింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్ల గ్యాప్.. ఓ సారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ వచ్చినా.. చివరకు విజయం టీఆర్ఎస్ అభ్యర్థినే వరించింది. గెలుపు సునాయసమే అనుకున్న బీజేపీ సరిగా వ్యూహాత్మకంగా ముందుకు సాగకపోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని పలువురు పేర్కొంటున్నారు.