Telangana cm kcr : తెలంగాణలో కరోనా వ్యాప్తి మూలంగా విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే సిబ్బందికి యాజమాన్యం కరోనా నేపథ్యంలో జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం ప్రకటించారు. నెలకు రూ.2వేలు ఆర్థిక సాయంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా 25కేజీల బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంట్, వివరాలతో జిల్లా కలెక్టర్కు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని విధివిధానాలు ఖరారు చేయాలని పేర్కొన్నారు. కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న సుమారు లక్షా 45వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్దిచేకూరుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కుటుంబాలను మానవీయ దృక్పదంతో ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసిఆర్ వెల్లడించారు. కేసిఆర్ నిర్ణయం పట్ల ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.