Telangana High Court:ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. గతంలోనూ ఇదే అంశంపై రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎం హోదాలో వైఎస్ జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారనీ, బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. జగన్ కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సీబీఐ వైఖరిని హైకోర్టు ఏమిటని హైకోర్టు ప్రశ్నించగా ..సీబీఐ కోర్టు తీర్పు తరువాత పరిస్థితిలో ఏమి మార్పులేదని స్పష్టం చేసింది. దీంతో రఘురామ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
మరో పక్క తెలంగాణ హైకోర్టులో జగన్ వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఈ కేసు విచారణ సందర్బంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి వీలులేదంటూ సీబీఐ తన వాదనలు వినిపించింది. ప్రధానంగా ఈ రెండు కేసుల్లో తీర్పులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.