Telangana High Court: తెలంగణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపి అంబులెన్స్ల నిలిపివేతపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ అంబులెన్స్ లు ఆపొద్దని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. ఏపి నుండి తెలంగాణకు వైద్య సహాయం కోసం అంబులెన్స్ లో వస్తున్న పేషంట్స్ ను సరిహద్దులో నిలిపివేస్తున్నారంటూ రిటైర్డ్ ఐఆర్ఎస్ వెంకట కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున న్యాయవాది అంబులెన్స్ ను నిలువరించడం చట్టవిరుద్దమని ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్ లను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్ లో ఏపి ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపి, చత్తీస్గడ్, కర్నాటక, మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల నుండి కరోనా బాధితులు హైదరాబాద్ కు వస్తున్నారనీ, దీంతో హైదరాబాద్ లో పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆసుపత్రుల్లో పడకలు రిజర్వు చేసుకున్న రోగులను అనుమతి ఇస్తున్నామనీ, ఈ విషయాన్ని ముందే చెప్పామన్నారు. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయని కోర్టుకు ఏజి తెలిపారు.
దీనిపై స్పందించిన హైకోర్టు ఏజి వాదనలను తప్పుబట్టింది. అంబులెన్స్ లను ఏ రాష్ట్రం అపలేదని తెలిపింది. అంబులెన్స్ ను నిలువరించడం రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించింది. జాతీయ రహదారులపై రాకపోకలను నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇస్తూ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండ వారాల్లోగా కౌంటర్ లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది.