Tension In gollapudi: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని పరిశీలించిన వస్తున్న దేవినేని ఉమా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగడం, ఆ తరువాత జరిగిన ఘర్షణలో వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవినేని ఉమా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేడు దేవినేని ఉమా నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు గొల్లపూడికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు వైసీపీ దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో గొల్లపూడి 1 సెంటర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
మరో పక్క కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలన చేయనుండగా కమిటీ సభ్యులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కమిటీ సభ్యులైన తంగిరాల సౌమ్య, నాలుగ్ మీరా, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, బొండా ఉమా కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురాంల గృహ నిర్బంధం కొనసాగుతోంది. టీడీపీ నేతలు కొండపల్లి రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.