అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీ అనుచరుడు దాసరి కిరణ్ అనే వ్యక్తి తమ కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి, అతని అనుచరులు వాహనాల్లో జేసీ ప్రభాకరరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో జెసి ప్రభాకరరెడ్డి ఇంట్లో లేరు.
జేసి వర్గీయులతో కెతిరెడ్డి వర్గీయులు వాగ్వివాదానికి దిగి అక్కడే ఉన్న కిరణ్ పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. దీంతో జేసీ వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్ద వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకోవడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జేసీ ప్రభాకరరెడ్డి నివాసంలో పెద్దారెడ్డి కూర్చున్న కూర్చీని జెసి అనుచరులు తగులబెట్టారు. తన ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన వర్గీయులతో వచ్చి దాడికి పాల్పడటంపై జేసి ప్రభాకరరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. దాడి నేపథ్యంలో జేసి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జేసి అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో ఇరువర్గాలు పెద్ద ఎత్తున మొహరించి ఉండటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు నారా లోకేష్, జెసి ప్రభాకరరెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడిని లోకేష్ తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి లేదా వైసీపీ రౌడీలకు తామే ఖచ్చితంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఇళ్లపై దాడి చేసి, కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్న వారి తలపొగరు అణచివేస్తామనీ, టీడీపీ అధికారంలోకి రావడం, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమని లోకేష్ పేర్కొన్నారు.