KCR: వేసవి ఎండతాపాన్ని మించిన రీతిలో తెలంగాణలో రాజకీయం జరుగుతోంది. కీలకంగా మారిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార ప్రతిపక్ష పార్టీలు చెమటోడుస్తున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే. ఈ సభకు ముందు జరిగిన పరిణామాలు వాగ్యుద్ధానికి దారితీశాయి.
KCR కేసీఆర్ సభలో జరిగేది ఇదేనా?
నాగర్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా ప్లానింగ్తో ఉన్నారు. నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఓ దఫా ప్రచారం నిర్వహించారు. నేడు మరో విడతగా బహిరంగ సభ హాలియా సమీపంలో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అన్ని వైపులా కవర్ చేసే విధంగా ఈ సభ జరగనుంది. 50 ఎకరాల్లో కేసీఆర్ ఎన్నికల సభ జరగనుంది. దీనికోసం 7 మండలాలు 2 మున్సిపాలిటీ నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఈ సభలో సాగర్ కు తాము ఏం చేశామో కేసీఆర్ సవివరంగా చెప్పనున్నట్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ ఏం చెప్తోంది?
తెలంగాణ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్యాయంగా కాంగ్రెస్ నాయకులను, జేఏసీ నాయకులను అరెస్ట్ చేసారని..ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే కేసీఆర్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సభనే అక్రమమని మండి పడ్డారు. రాజకీయాల కోసం కేసీఆర్ వస్తుంటే… కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం ఏమిటీ.. ఇంత దౌర్జన్యమా ? అని నిలదీశారు. ఓట్ల కోసం కేసీఆర్ వస్తుంటే కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.