ఏపి రాజధాని ప్రాంత గ్రామమైన వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గల కాలనీలో సిమెంట్ రోడ్డుకు ఆర్చి ఏర్పాటు విషయంపై రెండు వర్గాల వివాదం జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఇరువర్గాల మద్య ఆర్చి విషయంపై వివాదం తలెత్తింది. అయితే స్థానిక పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.
అయితే ఆదివారం రాత్రి ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో పది మందికి పైగా గాయపడ్డారు. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. దీంతో మళ్లీ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమ కు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు నేటి ఉదయం రోడ్డుపై భైటాయించి ఆందోళన దిగారు.
కాగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి తదితరులు గ్రామానికి చెరుకుని బాధితులను పరామర్శించారు. మరియమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సమస్యపై ఘర్షణలు పడకుండా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని నేతలు సూచించారు. గ్రామంలో పరిస్థితి ఉదృక్తంగా ఉండటంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.