రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పంచాయతీ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో సోమవారం నాడు స్థానిక పంచాయతీ ఎన్నికల కేసు విచారణ జరగనున్నది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనానికి బదిలీ మారింది. తొలుత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో లిస్టింగ్ అయ్యింది. ఆ తరువాత ఉద్యోగ సంఘాలు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రెండు పిటిషన్లను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏపి రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి కావడంతో స్వరాష్ట్రం కేసు కావడంతో ఆయన నాట్ బిఫోర్ మీ అంటూ ధర్మాసనం నుండి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు భావించారు. అయితే ఈ సమస్య ఉత్పన్నం కాకుండానే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిిన రెండు పిటిషన్ లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి చేరాయి.
ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ పిటిషన్ కు ముందే సుప్రీం కోర్టులో ఎస్ఈసీ కేవియట్ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీ కోరింది.
ఏపిలో పంచాయతీ ఎన్నికల నగారాను ఎస్ఈసీ మోగించింది. నాలుగు విడతలలో జరిగే ఈ ఎన్నికలకు గానూ తొలి దశకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి ధశ ఎన్నికల ప్రక్రియ శనివారం ప్రారంభం అయి ఫిబ్రవరి 5వ తేదీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికతో ముగియనున్నది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం సోమవారం జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేసి అదే రోజు నుండి నామినేషన్ లను స్వీకరించాల్సి ఉంటుంది.