ఏపిలో స్థానిక ఎన్నికల పంచాయతీ రసకందాయంగా ఉంది. ఒక పక్క ఎన్నికలు ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయాలని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా, మరో పక్క ఎట్టిపరిస్థితిలోనూ జరిపి తీరాలన్న కృత నిశ్చయంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎన్నికల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఈ లోపుగానే శనివారం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇప్పుడు అసలు సినిమా ప్రారంభం అవుతోంది. ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా సిబ్బంది అంటూ ఏది లేదు. ప్రభుత్వ సిబ్బందే ఎన్నికలకు సహకరించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సిబ్బంది ససేమిరా అంటున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ తో ఎస్ఈసీకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవద్దంటూ లేఖ రాయించారు. అయినప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మగడ్డ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ద్వారా పావులు కదపడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నందున చివరి అస్త్రంగా గవర్నర్ ను రంగంలోకి దింపే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇల్లు అలకగానే పండుగ కానట్లు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రన ఎన్నికలు జరిగిపోతాయనే భావన వైసీపీలో లేదు. గత మార్చి నెలలో ఎంపిటీసిీ, జడ్పీటీసీ ఎన్నికలను నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత కూడా ఎస్ఈసీ ఏకపక్షంగా వాయిదా వేసిన సందర్భం కూడా ఉంది. సోమవారం సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ ద్వారా నిమ్మగడ్డ దూకుడును కట్టడి చేయాలన్న ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మూకుమ్మడిగా సహాయ నిరాకరణ చేస్తే ఎన్నికల సంఘం కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం తప్ప ఎస్ఈసీ నేరుగా చేసేది ఏమి లేదు. ఇప్పటికే పలువురు అదికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ సిఫార్సు చేసినా వారు కరోనా వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే వెనుకేసుకువచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా సస్పెన్షన్లకు తాము భయపడమని అంటున్నారు. అంతిమంగా ఏమి జరుగుతుందో వేచి చూడాలి.