బోయినపల్లి కిడ్నాప్ కేసు … తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువులు బాధితులు కావడం, మరో రాష్ట్రానికి చెందిన తాజా మాజీ మంత్రి పాత్ర స్పష్టమవడం కలకలం రేపుతోంది.
ఈ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉండటం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసకుంటున్నాయి.
అఖిలప్రియ ప్యాకప్
హాఫిజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ కు ప్లాన్ చేసింది టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ అని గుర్తించిన పోలీసులు ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ను చేర్చారు. అయితే, భార్గవ్ రామ్ ఆచూకి ఇంకా దొరకలేదు. మరోవైపు కిడ్నాప్ వ్యహహారంలో భూమా కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు.. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు జగత్ కిడ్నాపర్లుతో మాట్లాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ అరెస్టు సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా విచారించారు పోలీసులు.. అతని నుండి వివరాలు సేకరించి వదిలేశారు.
అఖిలప్రియ భర్త అక్కడే ఉన్నారా?
అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఆచూకి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. భార్గవ్ రామ్ పోలీసులకు దొరికితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కిడ్నాప్ కేసులో అనేకమంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరికోసం గాలిస్తుండగా, కొంతమంది గోవాలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. విజయవాడలోని నిందితుల ఇళ్లకు పోలీసులు వెళ్లగా, అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు గోవాలో ఉన్నారని, తెలియడంతో అక్కడ కూడా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా, విజయవాడలో అదుపులోకి తీసుకున్న నిందితులను ఈరోజు రాత్రికి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఆధారాలు దొరకడం , నిందితులు కూడా అదుపులోకి తీసుకున్న తరుణంలో నిజం ఒప్పుకోవడం ఒక్కటే అఖిలప్రియ సహా ఇతరుల ముందున్న ఆప్షన్ అని పలువురు పేర్కొంటున్నారు.