KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇద్దరు మహిళా నేతలు కొత్తగా టార్గెట్ చేస్తున్నారు. ఓ వైపు కరోనా కల్లోలం , తెలంగాణలో లాక్ డౌన్ అమలుతున్న తరుణంలో ప్రత్యక్షంగా విలేకరుల సమావేశాలు పెట్టడం కష్టమని అనుకుంటున్నారో లేకపోతే కొత్త పంథాలో ముందుకు సాగాలని భావిస్తున్నారో తెలియదు కానీ నూతన మాధ్యమంతో ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు. ఆ ఇద్దరు నేతలే మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి , ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల.
సోషల్ మీడియాలో రాములమ్మ ఫైర్…
తెలంగాణ సీఎం కేసీఆర్ను సోషల్ మీడియా వేదికగా మరోసారి బీజేపీ నేత విజయశాంతి టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించిన ఆమె కరోనా విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని దుయ్యబట్టారు. పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుంది.. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు. ఈ మేరకు ట్వీట్లలో విరుచుకుపడ్డారు.
షర్మిల సైతం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల సీఎం పదవిని కూడా కాంట్రాక్టు పద్దతిన చేపట్టాలని కేసీఆర్ కు చురకలు అంటించారు. కేసీఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. “అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సిఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే ..” అని కామెంట్ చేశారు.