Corona: కరోనా కలకలం కొనసాగుతుంటే మరోవైపు కొందరు పాపాత్ముల తప్పుడు పనులు మాత్రం యథావిధిగా సాగిపోతున్నాయి. కరోనా బాధితులకు ప్రాణదాతగా భావిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్ల ఆసరగా చేసుకుని, కొందరు దుర్మార్గులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ దందాకు తెరలేపారు. గుట్టు చప్పుకు కాకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వరుస దాడుల్లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న దగాకోరులను పట్టుకుంటున్నా… కొందరు మాత్రం తమ పాడుపనులు కొనసాగిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రెండింటా అదే పరిస్థితి…
కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అంతేకాదు ఇంజక్షన్లను ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాల పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్రమార్కుల భరతం పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో దాదాపు రెండు రోజులకో మూఠాను అరెస్టు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కింది స్థాయిలోనే…
హైదరాబాద్ , విశాఖపట్టణం, విజయవాడ వంటి ముఖ్య పట్టణాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఈ మోసాలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఓ ముఠాను పోలీసులు, వైద్యాధికారులు కలిసి పట్టుకున్నారు. కరోనా పేషెంట్లకు అధిక ధరలకు రెమిడెసివర్ ఇంజక్షన్లను అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దీంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ బ్లాక్ దందా కొనసాగకుండా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.