YS Sharmila: వైఎస్ షర్మిల .. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటుకోవాలని సిద్ధమై …అందుకు తగినట్లే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న మహిళా నేత. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి షర్మిల తనదైన శైలిలో దూకుడుగానే ప్రతి విషయంలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, షర్మిల విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిపై కొత్త చర్చ జరుగుతోంది.
Read More: YS Sharmila: షర్మిల కొత్త రాజకీయం … వర్కవుట్ అవుతుందా?
షర్మిల ఘాటు వ్యాఖ్యలు…
తాజాగా, రంగారెడ్డి జిల్లా పాలెపల్లిలో తడిసిన రైతుల ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లారు షర్మిల . ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కోవిడ్, ధాన్యం కొనుగోళ్లు అనే కీలకమైన రెండు అంశాలల్లో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా విఫలం అయిందని ఆరోపించారు. ధాన్యం పండించిన రైతులు అమ్మకం విషయంలో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చివరి గింజ వరకు కొంటానని సీఎం చెప్పిన తర్వాతే రైతులు సాగు చేశారని అయితే, ఇప్పుడు రైతులు తమ గుండెలు బాదుకునేలా అరుస్తున్నప్పటికీ సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Read More: KCR: కేసీఆర్… జగ్గారెడ్డి అనే వీరాధివీరుడి గురించి నీకు తెలుసా?
సంచలన ఆరోపణలు చేసిన షర్మిల…
బట్టలు మార్చుకున్నంత సులభంగా రైతులకు ఇచ్చిన మాట మారుస్తారా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 వేల పుస్తకాలు చదివానని, ఎకరాకు కోటి రూపాయల లాభంతో సాగు చేస్తున్నానని చెప్పుకొనే సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతు కష్టం తెలియదా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి అని ఆమె ఆరోపించారు. కాగా, ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై షర్మిల ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రైతు సమస్యలపై అదే వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ఇటు టీఆర్ఎస్ వర్గాలు అటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే… కొద్దిరోజుల పాటు షర్మిల కామెంట్లను లైట్ తీసుకోవాలన్న వ్యూహం కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.