ఏపీలో హాట్ హాట్ రాజకీయం దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా రామతీర్ధం ఘటనతో ఈ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
బీజేపీ ఆధ్వర్యంలో రామతీర్ధం ధర్మయాత్ర కమలం పార్టీ చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం క్షేత్రస్థాయిలో పలుచోట్ల ఆందోళనలు చేశారు. అనంతరం ఏపీ గవర్నర్ను కలిసి ఆలయాలపై దాడుల విషయంలో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సీబీఐ తో విచారణ జరిపించాలని కూడా విపక్షాలు కోరుతున్నాయి. దేవాలయాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో సీఎం జగన్ పెద్ద మనసు చాటుకునేలా చేసిన ఓ పని చర్చగా మారింది.
జగన్ పెద్ద మనసు …
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. ముందుగా మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఓ మూగజీవానికి దెబ్బ తగలకుండా తన చేతిని అడ్డుపెట్టారు. గోవులకు కామధేను పూజ చేస్తున్న సమయంలో ఎ గోవు తన తలను ఊపుతుండగా పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తగులుతుందని సీఎం జగన్ భావించారు. వెంటనే ఆ గోవుకు రాడ్ తగలకుండా తన చేతిని అడ్డుగా ఉంచారు. దీంతో ఆ గోవుకు ప్రమాదం తప్పింది. సీఎం జగన్ చేసిన పనికి ఆ పశువుల కాపరి చేతులెత్తి నమస్కరించారు.
అనుకోకుండా చేసిన పనితో…
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపట్టిన కార్యక్రమంలో అనుకోకుండా జరిగిన సంఘటనతో ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనసు వార్తల్లోకి ఎక్కింది. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేయటం, ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేయటం కూడా ఈ కార్యక్రమలో భాగం. ఇప్పటికే దేవాలయానికో గోమాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నరసరావు పేట స్టేడియంలో గోపూజ ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ అనుకోకుండా జరిగిన ఘటనతో తనకు గోవులంటే ఉన్న మమకారాన్ని చాటుకున్నారని పలువురు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.