Corona: ఇప్పుడంతా కరోనా కలకలం గురించే చర్చ . ఈ మహమ్మారి పెద్ద ఎత్తున విస్తరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో మరో కీలక అప్డేట్ తెరమీదకు వచ్చింది. అదే సిటీ స్కాన్. అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్తో క్యాన్సర్ రావొచ్చని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. చెస్ట్ ఎక్స్రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు.
ఇవి అసలు చేయవద్దు
కరోనా తొలి దశలో స్టెరాయిడ్స్ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా అది ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉందని నిమ్స్ అధిపతి హెచ్చరించారు. తేలికపాటి కేసుల్లో సాధారణ మందులతో కొవిడ్ నయమైపోతుందని డాక్టర్ గులేరియా తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్లో ఉండి కోలుకోవచ్చన్నారు. డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని తెలిపారు. కరోనా పాజిటివ్గా తేలి, తేలికపాటి లక్షణాలు ఉన్న వారు రక్త పరీక్షలకు కూడా వెళ్లాల్సిన పనిలేదన్నారు. బయోమేకర్స్ హానికరమని, సీటీ స్కాన్ కూడా అత్యవసరమైతేనే చేయించాలని సూచించారు.
కరోనా లక్షణాలు ఇవే
కరోనాకు సంబంధించిన లక్షణాలకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు ఇవి…
– శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరంగా ఉంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్లుగా భావించాలి.
– శ్వాసక్రియ రేటు నిమిషానికి 24గా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గదిలో SpO2 నిష్పత్తి 90 నుంచి 93 శాతంగా ఉంటే కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉన్నట్లే.
– శ్వాసక్రియ రేటు నిమిషానికి 30గా ఉండటం, ఊపిరి తీసుకోలేకపోవడం, SpO2 నిష్పత్తి 90 శాతానికి కింద ఉంటే కరోనా సింప్టమ్స్ తీవ్రంగా ఉండి, పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉందని గ్రహించాలి.
– సామాజిక దూరం, ఇండోర్లోనూ మాస్క్ వేసుకోవడం, పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి.
– మల్టీ విటమిన్స్, యాంటీ పైర్టిక్స్ మెడిసిన్స్ వేసుకోవాలి.
– SpO2 లేదా పల్స్ ఆక్సీమీటర్ సాయంతో టెంపరేచర్, ఆక్సీజన్ సాచ్యురేషన్ను నిరంతరం చెక్ చేసుకోవాలి.
– శ్వాస తీసుకోవడంలో సమస్యగా అనిపిస్తే వైద్యసాయం అవసరమని గ్రహించాలి.
– 5 రోజుల వరకు జ్వరం, దగ్గు తగ్గనట్లయితే వైద్యుడ్ని వెంటనే కలవాలి.