Viveka Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు వరుస షాక్ లు ఎదురు అవుతున్నాయి. వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడంతో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో సూత్రధారుల అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా చేసుకుని సీబీఐ అధికారులు విచారణను నిర్వహిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Viveka Case: సీబీఐ అధికారులకు బెదిరింపులు
ఈ తరుణంలో విచారణ అధికారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి..సీబీఐ అధికారి తనను వేధిస్తున్నారని, వారు చెప్పిన విధంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సీబీఐ అధికారిపై కేసు నమోదు చేశారు. దీనిపై సదరు సీబీఐ అధికారి హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసుపై స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా సీబీఐ అధికారులకు కడపలో బెదిరింపులు ప్రారంభమైయ్యాయి.
Viveka Case: కడప నుండి వెళ్లిపోవాలంటూ..
సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడంతో వారు కడపలోని చిన చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు వాహనంలో కడప సెంట్రల్ జైలుకు వెళుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. కడప నుండి వెళ్లిపోవాలంటూ వాహన డ్రైవర్ ను, అందులో ఉన్న అధికారులను బెదిరించారు. గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపులపై సీబీఐ అధికారులు చేసిన ఫిర్యాదునకు జిల్లా పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ అధికారులను ఎవరు బెదిరించారు అనే విషయంపై ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలించే పనిలో నిమగ్నమైయ్యారు.