వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా సికింద్రాబాద్ – విశాఖ వయా విజయవాడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనుండగా, రైల్వే అధికారులు ట్రైయల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో చెన్నై నుండి విశాఖ వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కంచర్లపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో రెండు కోచీల అద్దాలు దెబ్బతిన్నాయి.
దీనిపై రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) రైలు కోచ్ నుండి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ శ్రీకాంత్ తెలిపారు. రైల్వే చట్టం కింద ఆ వ్యక్తులపై అభియోగాలు మోపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించేందుకు కొద్దిరోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమైయ్యారు. రైలులో ప్రయాణీకుల భద్రత, భద్రతకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితులు మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.