చిత్తూరు జిల్లాలో శనివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని పాకాల మండలం నెండ్రగుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తిరుమల నుండి బెంగళూరు వైపువెళుతున్న ఓమ్ని వ్యాన్ ను లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బంగారుపాలెంకు చెందిన రాణెమ్మ (80) తో పాటు కర్నాటకలోని సంగిరి మండలం తొండపల్లికి చెందిన అన్నపూర్ణ (60), జ్యోతి (14) లు మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.