కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుండి భారీ గా వరద నీరు చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ ప్రాంతం నుండి 2,65,423 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,65,635 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది పరివాహాక ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా, శుక్రవారం ముగ్గురు కృష్ణానదిలో గల్లంతు అయ్యారు.
ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమంలో సరదాగా స్నానం చేసేందుకు ఆరుగురు ఎనిమిదవ తరగతి విద్యార్ధులు వెళ్లారు. వారు స్నానం చేస్తుండగా వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో నలుగురు విద్యార్ధులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడగా, ఒక విద్యార్ధిని వాకింగ్ కు వచ్చిన యువకుడు కాపాడాడు. మరో విద్యార్ధి ఉప్పలపాటి లోకేశ్ (13) మాత్రం నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విషయం తెలియడంతో ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్లు లోకేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అదే విధంగా మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెం లో ఎడ్లబండిని శుభ్రం చేసేందుకు నలుగురు యువకులు కృష్ణానదిలోకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వరద ఉదృతి పెరిగింది. నలుగురిలో ఇద్దరికి ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి వరకూ కూడా ఇద్దరి ఆచూకి తెలియరాలేదు. కాగితాల హసంత్ (22), మేకా వెంకటేశ్ (20)లు నదిలో గల్లంతు అయ్యినట్లు సమాచారం. చీకటి పడటంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.