అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏపి, తెలంగాణకు చెందిన కొందరు తెలుగు విద్యార్ధులు వెళుతున్న మినీ వ్యాన్ కన్నెక్టికట్ లో ఎదురుగా వెళుతున్న ఓ ట్రక్కును ఢీకొట్టింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్ లో ఎనిమిది మంది విద్యార్ధులు ఉండగా, ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తమ పిల్లల మరణవార్త తెలియడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి (హైదరాబాద్), పావని (వరంగల్), ఏపిలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కిడయపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు సాయి నరసింహ (23) ఉన్నారు. కడియపులంక గ్రామానికే చెందిన ఎస్ ఐశ్వర్య అనే విద్యార్ధి కూడా ప్రమాదానికి గురైన వ్యాన్ లో ఉన్నప్పటికీ ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.
ఉద్యోగాన్ని వదులుకొని ఉన్నత చదువుల కోసం వెళ్లి..
ప్రమాదం లో మృతి చెందిన సాయి నరసింహా చెన్నైలోని ఓ ప్రముఖ కళాశాలలో ఈ ఏడాది బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యులోనే ప్రముఖ కంపెనీలో ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. అయితే ఎంఎస్ పూర్తి చేయాలన్న ఆకాంక్షతో ఆ ఉద్యోగాన్ని వదులుకుని మూడు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. రెండు రోజుల క్రితం అక్కడ దీపావళి వేడుకలు జరుపుకుని తల్లిదండ్రులు, సోదరితో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఇంతలోనే సాయి నరసింహా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం రావడంతో అతని తల్లిదండ్రులు శ్రీనివాస్, సుశీల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
RGV: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సంచలన దర్శకుడు ఆర్జీవీ భేటీ .. భేటీలో ట్విస్ట్ ఏమిటంటే..?