Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగింది. కడప శివారు లోని స్పిరిట్ కళాశాల వద్ద రిమ్స్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బైక్ లు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్ధులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.