TIRUPATHI:తిరుపతి పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసింది. తిరుపతిలో గెలిచిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో అస్వస్థతకు గురై మృతి చెందగా ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్లమెంట్ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. అయితే ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా గత ఎన్నికలో పోటీ చేసి పరాజయం పాలైన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించింది. బీజెపీ – జనసేన అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో సీఎం వైఎస్ జగన్ స్ట్రాటజీ ఎమిటీ, ఇప్పటి వరకూ ఆయన ఎందుకు అంతగా దృష్టి సారించడం లేదు, తన ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంగ్ చూడాలని భావిస్తున్నారా అంటే ఆ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. తొలుత తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిగా దివంగత ఎంపి దుర్గాప్రసాద్ కుమారుడుని దింపుతారని అందరూ భావించినప్పటికీ జగన్ మాత్రం ఆ అభ్యర్థిత్వాన్ని తన పాదయాత్రలో ఫిజియోథెరఫీ సేవలు అందించిన డాక్టర్ గురుమూర్తిగా ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. జగన్ నిర్ణయమే శిరోధార్యమని ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పేశారు.
తిరుపతి పార్లమెంట్ వైసీపీకి సిట్టింగ్ స్థానం, గెలుపు ఖాయమే అన్న ధీమా వైసీపీలోనూ బయట వినబడుతోంది. అయితే గెలుపు ఒక్కటే సరిపోదు కదా గత ఎన్నికలో వచ్చిన రెండు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీ రావాల్సి ఉంటుంది. దాదాపు 18 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినందున ఆ మెజార్టీ ఇంకా పెరగాలన్నది జగన్ ఉద్దేశం. ప్రధానంగా ఇక్కడ వైసీపీ గెలుపు ముఖ్యం కాదు మెజార్టీ కూడా తగ్గకుండా చూసుకోవాలి. గత ఎన్నికల మెజార్టీ రాకుండా ఏ మాత్రం తగ్గినా ప్రభుత్వం పని అయిపోయిందంటూ ప్రతిపక్షాలు విమర్శించే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలపై క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారనీ, పలువురు ఎమ్మెల్యేలు అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే మాటలు వినబడుతున్నాయి. అయితే వీటిని జగన్ తొలగించే ప్రయత్నం ఇంత వరకూ చేయలేదు. త్వరలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం అవుతామని చెప్పినా ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు, ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. మరో పక్క టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ బాధ్యులను నియమించింది. బీజెపీ –జనసేన దూకుడుకు సిద్ధమవుతున్నాయి. అయినప్పటికీ సీఎం జగన్ మాత్రం తిరుపతి విషయంలో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.