Tirupati By Poll: ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ ఒక పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో బయట ప్రాంతాల నుండి మనుషులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారనీ, అందుకు సంబంధించి పలు అధారాలతో ఇప్పటికే టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ద్వారా ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.
ప్రతిపక్షాలు పోలింగ్ పై ఆరోపణలు చేస్తుండగా అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని నివేదిక ఇచ్చారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడియో టేప్ ఒకటి బయటకు రావడం కలకలాన్ని రేపింది. దొంగ ఓట్లు పోల్ అయ్యాయంటూ టీడీపీ, బీజేపీ నేతల ఆరోపణలకు వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ లు ఇచ్చారు. రిగ్గింగ్ చేయాల్సిన అవసరం వైసీపీ లేదనీ, ఓటమికి ఆ పార్టీలు సాగుగా చెప్పుకోవడానికి విమర్శలు చేస్తున్నాయని కొట్టిపారేశారు. రిగ్గింగ్ జరిగితే 80శాతంకి పైగా ఓటింగ్ జరిగేదని వైసీపీ నేతలు అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్ తో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
అయితే టీడీపీ మాత్రం కోర్టును ఆశ్రయించలేదు. ఈ వ్యవహారంలో తాజాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నేడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు నిలుపుదల చేయాలని, ఎన్నికలను రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆమె కోరారు. ఉప ఎన్నికల పోలింగ్ లో భారీగా అక్రమాలు జరిగాయనీ వాటికి సంబంధించిన అధారాలు తమ వద్ద ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. రేపు విచారణ కు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రత్న ప్రభ దాఖలు చేసిన పిటిషన్ లో ప్రతివాదులుగా ఎన్నికల సంఘంతో పాటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లను చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ చేయనున్న హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.