Tirupati By Poll : తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ తీసుకున్న ఓ నిర్ణయం బీజేపీ – జనసేన లకు షాక్ కొట్టినట్లు అయ్యింది. తిరుపతి ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ ఉండగా జనసేన మద్దతు ఇస్తోంది. రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఇరు పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రత్నప్రభ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రచార పర్వంలో పాల్గొంటుండటంతో బీజేపీలో కొంత ధైర్యం వచ్చింది.
గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలో నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో నోటాతో పోటీపడే మీరు అధికార వైసీపీని మీరు ఢీకొడతారా అంటూ ఆ పార్టీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. జనసైనికులు, జనసేనాని మద్దతు కోసం బీజేపీ నాయకులు ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా తమ సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల గుర్తు కేటాయింపులో ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం ఈ రెండు పార్టీలను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఓ పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేస్తుండగా ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును నవతరం పార్టీ కి ఈసీ కేటాయించింది. దీంతో జనసేన ఓట్లు చీలి బీజేపీకి నష్టం జరుగుతుందన్న ఆందోళన మొదలైంది.
జనసేనకు ఇంకా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా రాలేదు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం లేదు. దీంతో గాజు గ్లాసు గుర్తును నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కు కేటాయించారు. ఈ పరిణామం బీజేపీ – జనసేనలో ఆందోళన కల్గిస్తుంది. తమ పార్టీ ఎన్నికల గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడం ఏమిటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నవతరం పార్టీ అభ్యర్థి తన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను పోస్టర్ లో ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. కాగా దీనిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం దీనిపై మాట్లాడుతూ జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తమ పార్టీ అభ్యర్థికి ఆ గుర్తును కేటాయించారని పేర్కొంటున్నారు.