Tirupati By Poll: తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి టీడీపీ సన్నద్దం అవుతుండగా ఇదంతా చంద్రబాబు డ్రామా అంటూ వైసీపీ ఆరోపిస్తున్నది. తిరుపతిలో ఓటమి ఖాయమని తెలిసే చంద్రబాబు ఈ విధంగా చేస్తున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.
Tirupati By Poll: ఖరారు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు
ప్రతిపక్ష నేత చంద్రబాబుకే రక్షణ కల్పించలేని పోలీస్ యంత్రాంగం సామాన్య ప్రజలకు ఏమి భద్రత కల్పిస్తుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఈ ఘటనపై ఇటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ రోజు గవర్నర్ అపాియింట్మెంట్ కోసం లేఖ రాయగా, సాయంత్రం 5.30 గంటలకు టీడీపీ ప్రతినిధులతో మాట్లాడేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అపాయింట్మెంట్ ఖరారు చేశారని రాజ్ భవన్ నుండి ఆ పార్టీ నేతలకు సమాచారం అందింది.
ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎంపీలు
ఇక టీడీపీ ఎంపిలు కనకమేడల రవీంద్ర బాబు, గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు. తిరుపతి ఉప ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని వీరు ఈసీకి విజ్ఞప్తి చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తిరుపతిలో నిన్న జరిగిన రాళ్ల దాడి విషయాలను అటు గవర్నర్, అటు ఈసీకి వివరించి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరనున్నారు. ప్రస్తుతం అల్లర్లు ఎక్కువగా ఉన్నపశ్చిమ బెంగాల్ లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ డిమాండ్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు, లోకేష్ తో సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపు కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 14వ తేదీన ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని భావించినా కరోనా కేసులు పెరుగుతున్న నేఫథ్యంలో వైేఎస్ జగన్ తన పర్యటనను రద్దు చేసుకుని రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రిటైర్డ్ ఐఎఎస్ రత్నప్రభ గెలుపునకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేస్తున్నారు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నిన్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అంతకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.