Tirupati By poll : తిరుపతి ఉప ఎన్నికలలో బీజెపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు గుండాగిరి చేస్తున్నారని దుయ్యబట్టారు. తనను సినిమాల్లోకి వెళ్లాడంటూ విమర్శిస్తున్న వారికి సమాధానంగా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్ లు లేవని అన్నారు. తాను సినిమాలు మానేసి అడ్డదారులు తొక్కనని అన్నారు. భయాన్ని విడనాడి అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, తెగింపు రావాలన్నారు. చైనా వాళ్లు మన భూభాగంలోకి వచ్చి మన వాళ్లను కాల్చేస్తుంటే ఇక్కడి వాళ్లు శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నరికి చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారనీ వీరికి దేశ భక్తి ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
40 ఏళ్ల సివిల్ సర్వీస్ లో విశిష్టమైన సేవలు అందించిన రత్న ప్రభ మానవహక్కుల కోసం పని చేశారన్నారు. ఏపి ఐటీ హబ్ గా ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభే నని గుర్తు చేశారు. వైసీీపీ అభ్యర్థి ఎంపిగా గెలిస్తే ఎమి చేయగలరో చెప్పాలన్నారు. ఆయన గెలిస్తే ఎమీ మాట్లాడలేరనీ, పార్టీ కంట్రోల్ లోనే ఉంటారనీ విమర్శించారు. రత్న ప్రభ గెలిస్తే సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపిలు ఉండి ఏమి చేయలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల క్షేమం, అభివృద్ధి జరగాలంటే అధికార బదలాయింపు జరగాలన్నారు. తాను సీఎం పదవి గురించి ఎప్పుడూ ఆలోచించలేదనీ. ఒక వేళ సీఎం పదవి వస్తే ఏడు కొండల వాడి సాక్షిగా అందరి కంటే ఎక్కువ సేవ చేయగలనని అన్నారు. అయితే తాను దాని కోసం అర్రులు చాచడం లేదన్నారు. ప్రజలు నోటు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతారనీ రూ.2వేలకు భవిష్యత్తు అమ్ముకోవద్దని సూచించారు పవన్ కల్యాణ్. ఇక్కడి నుండి బరిలో ఉన్న రత్నప్రభను ఆదరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తొలుత అభ్యర్థి రత్నప్రభ పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి స్వాగతం పలికారు.
బహిరంగ సభకు ముందు తిరుపతి లోని ఎమ్మర్ పల్లి కూడలి నుండి శంకరంబాడి కూడలి వరకూ పవన్ పాదయాత్ర గా చేరుకున్నారు. అనంతరం శంకరంబాడి విగ్రహం వద్ద నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సభలో బీజేపీ నేత సునీల్ దేవధర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.