Tirupati By Poll: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5గంటల వరకూ 54.99 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్ ల వారీగా పోలింగ్ శాతం చూసుకుంటే సర్వేపల్లిలో 57.91 శాతం, గూడూరు అసెంబ్లీ సిగ్మెంట్ లో 51,82, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 60.11 శాతం, వెంకటగిరి సిగ్మెంట్ లో 55,88, తిరుపతిలో 45,84, శ్రీకాళహస్తిలో 57,00, సత్యవేడు అసెంబ్లీ సిగ్మెంట్ లో 58.,45 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 17,10,699 మంది ఓటర్లకు గానూ 9,40,678 మంది 5గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించిన వారినే పోలింగ్ కేంద్రాలకు అనుమతించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ ప్రొటోకాల్ పాటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందనిీ అధికార వై సీ పీ సంతృప్తి వ్యక్తం చేస్తుండగా టీ డీ పీ, బీ జే పీ మాత్రం అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మే 2వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, బీజేపీ – జనసేన అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి.