Tirupati By Poll: రాష్ట్రంలో ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు బీజేపీ – జనసేన నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున వివిధ ప్రాంతాల నుండి జనాలను తరలించి దొంగ ఓట్లు వేశారంటూ పలు వీడియోలను ఆ పార్టీలు మీడీయాకు విడుదల చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సీఇఓకు ఫిర్యాదు చేశారు. కాగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు దృవీకరించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్షాల ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తిరుపతి ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా మరి కొందరు కూడా తిరుపతి ఉప ఎన్నికలపై పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ లను కొట్టేసింది. దీంతో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు లైన్ క్లీయర్ అయ్యింది. మే 2వ తేదీ తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్, బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ సీినియర్ ఐఎఎస్ రత్నప్రభతో సహా పలువురు రంగంలో ఉన్న సంగతి తెలిసిందే.