Lock Down: ఇప్పుడంతా కరోనా కలకలం గురించే చర్చ. ఓ వైపు వ్యాక్సిన్ గురించి ఆలోచనలు మరోవైపు పెద్ద ఎత్తున నమోదు అవుతున్న కేసులు … భారీ స్థాయిలో మరణాలతో ప్రజలు టెన్షన్కు గురవుతున్న పరిస్థితి. ఈ సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ చేయడానికి మరోసారి దేశ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్నవార్తలు వైరల్ గా మారిపోయాయి. ఫలానా తేదీ నుంచే లాక్ డౌన్ అన్న టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కీలక క్లారిటీ వచ్చింది.
ఇది ప్రచారం…
కోవిడ్ కట్టడికి కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. మరికొన్ని మినీ లాక్డౌన్, ఇంకా కొన్ని వీకెండ్ లాక్డౌన్, చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ ప్రకటించినా.. అది రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిన విషయం తెలిసిందే. లాక్డౌన్ బాధ్యత మాది కాదు.. కేసుల తీవ్రత, పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ మే 3వ తేదీ నుంచి 20వ తేదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. లాక్డౌన్ విధిస్తామని కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ క్లారిటీ ఇచ్చింది.
డిల్లీలో మాత్రం లాక్ డౌన్…
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన ఢిల్లీ సర్కార్.. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించారు. ఇంకా పరిస్థితిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో.. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో.. ఈ నెల 10వ తేదీ వరకు ఢిల్లీలో లాక్డౌన్ అమల్లో ఉండబోతోంది. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మరోవారం పాటు లాక్డౌన్ ఆంక్షలు పొడిగించారు..