AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సీఆర్డీఏ రద్దు చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
AP High Court: విచారణ కొనసాగుతుండగానే ఆ చట్టాల రద్దు
ఈ పిటిషన్ లపై విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు అన్నీ నిరర్ధకం అవుతాయనీ, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. అయితే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన పిటిషన్ లలో కొన్ని అభ్యంతరాలు మిగిలే ఉన్నాయనీ, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఫిబ్రవరి నాల్గవ తేదీన ఈ పిటిషన్లపై ఇరపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరో పక్క ప్రభుత్వం త్వరలో రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి ప్రాంత రైతుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.