AP SEC: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏపి హైకోర్టు ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల సంఘం అధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్ని నేడు (శుక్రవారం) సమావేశం కానున్నది. సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కౌంటింగ్ చేపట్టేందుకు అవసరమైన సిబ్బంది, పటిష్టమైన భద్రతా చర్యలపై నేడు జరిగే సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 19వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు ఫలితాలు వెల్లడించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. హైకోర్టు ఆదేశాలతో 515 జడ్పీటీసీ, 7,321 ఎంపీటీసీ సీట్లకు ఓట్ల లెక్కింపు జరగనున్నది.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఎస్ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ 8న ఎన్నికలను నిర్వహించారు. అయితే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నాలుగు వారాల గడువు లేకుండా షెడ్యూల్ ఇవ్వడంపై టీడీపీ, జనసేన సహా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికలకు కొత్త షెడ్యుల్ విడుదల చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం, ఎస్ఈసీ అప్పీల్ కు వెళ్లగా సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 9,692 ఎంపీటీసీ, 652 జడ్పీటీసీ సీట్లకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా 2,371 ఎంపీటీసీ స్థానాలు, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పలు కారణాల వల్ల 354 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక ఆగింది. మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాలకు, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగింది.