Tollywood Hero Nani: ఏదైనా తమ దాకా వస్తే గానీ తత్వం బోధపడదు అంటారు. అలానే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పెద్దల పరిస్థితి తయారు అయ్యింది. ఏపిలో సినిమా టికెట్ ధరలపై ఇటీవల హీరో నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యలపై ఏపిలోని మంత్రులు మంత్రులు బొత్సా సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు స్పందించి కౌంటర్ లు ఇచ్చారు. టాలీవుడ్ లో ఐక్యత లేదన్న విషయం చాలా కాలంగా వినబడుతూనే ఉంది. అదే విషయాన్ని హీరో నాని వెల్లడించారు. ఏపిలో సినిమా టికెట్ల విషయంపై తన అభిప్రాయం చెప్తే మీడియా దాన్ని పెద్దది చేసి చూపించిందనీ నాని ఆరోపించారు. కాకపోతే సమస్య అనేది నిజమని, అది వచ్చినప్పుడు అందరూ ఒకటికావాల్సిన అవసరం ఉందని హీరో నాని పేర్కొన్నారు. కానీ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదన్నారు. తాను చెప్పిన మాటలు తప్పు అయితే తనకు ఆనందమేననీ కానీ టావీవుడ్ లో మాత్రం యూనిటీ లేదని నాని స్పష్టం చేశారు. తాను ఇండస్ట్రీలో ఎవరినీ అవమానించడానికి ఈ మాటలు అనడం లేదని అన్నారు. వకీల్ సాబ్ మువీ విడుదల సమయంలోనే ఈ సమస్య మొదలైందనీ, అప్పుడే అందరూ ఒక తాటిపైకి వచ్చి ఏపిలో టికెట్ల రేట్ల సమస్యలపై డీల్ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని నాని అభిప్రాయపడ్డారు.
Tollywood Hero Nani: టాలీవుడ్ లో ఆందోళన
కాగా త్వరలో భారీ బడ్జెట్ మువీలు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ ను ఆందోళన కల్గిస్తున్నాయి. మరో పక్క మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిలతో సమస్య పరిష్కారానికి చర్చించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నారు. జనవరి 2, 3 తేదీల్లోపు ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావంతోనూ ఉన్నారు. తెలంగాణలో మాదిరిగా సినిమా టికెట్ ల ధరల పెంపునకు ఏపి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. మరో పక్క తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించగా ఏగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో నిర్మాత నట్టికుమార్ ప్రభుత్వం ఆ విధంగా ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ధరల పెంపు వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపి ప్రభుత్వంతో మధ్యమార్గంగా ఏదైనా పరిష్కారానికి సినీ పెద్దలు జోక్యం చేసుకుంటారో లేదో వేచి చూడాలి.