Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ల వివాదంపై ఇంకా వాడివేడిగా చర్చ జరుగుతూనే ఉంది. ఏపి ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణతో ఇండస్ట్రీకి తీవ్ర నష్టం జరుగుతోందన్న అభిప్రాయం వారిలో ఉన్నా కొంత మంది మాత్రమే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నిర్మాత సీ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించారు. ఇప్పుడు ఉన్న టికెట్ల ధరల పెంపుపై ఏపి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకూ అందరు ముఖ్యమంత్రులు టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుకూలంగానే వ్యవహరించారని పేర్కొన్న కళ్యాణ్ .. ఏపి సీఎం జగన్ తో టాలీవుడ్ కు ఇటీవల కాలంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనన్నారు.
Tollywood: దాసరి లేని లోటు కనబడుతోంది
ఇదే క్రమంలో ఆయన దివంగత దాసరి నారాయణరావును గుర్తు చేస్తూ అటువంటి పరపతి కల్గిన వ్యక్తి ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం తమకు మేలే అని పేర్కొన్న ఆయన టికెట్ ధరలు పెంచకపోతే ఇండస్ట్రీకి తీరని నష్టమేనన్నారు. టికెట్ల ధరలపై ప్రభుత్వం మరో సారి పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత డి సురేష్ తదితరులు కూడా టికెట్ ధరల విషయంలో ఏపి సర్కార్ కు విజ్ఞప్తులు చేసిన విషయం తెలిసిందే. సమస్యలపై చర్చించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా సీఎం వైఎస్ జగన్ తో నేరుగా చర్చించాలని భావిస్తూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనీ, సంబందిత మంత్రి పేర్ని నానితో భేటీ కావాలని సూచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొని ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.