AP News Districts: ఏపిలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సీఎం జగన్మోహనరెడ్డి ముందుగా చెప్పినట్లు ఉగాది నాటి నుండి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలను 26 జిల్లాలుగా చేస్తూ కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం విధించిన గడువులోగా 11 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది.
AP News Districts: అదనంగా మరో అయిదు రెవెన్యూ డివిజన్లు
పలు జిల్లాల్లో రాజకీయాలకు అతీతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా పలు అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముసాయిదా నోటిఫికేషన్ లో పేర్కొన్న 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో అయిదు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదే విధంగా బాలాజీ జిల్లా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాను తిరుపతి పేరుతోనే నోటిఫికేషన్ లో సవరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
న్యాయపరమైన చిక్కులు రాకుండా
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుక సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారిగా అధికారులు, సిబ్బంది నియామకం పూర్తి అయ్యింది. కొత్త కలెక్టరేట్ లలో మౌళిక సదుపాయాల కల్పనపై అధికార యంత్రాగం దృషి పెట్టింది. తిరుపతి పద్మావతి నిలయంలో జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇవ్వగా, ప్రభుత్వం ధర్మాసనాన్ని ఆశ్రయించగా స్టే కొట్టేసింది. దీంతో అధికారులు బాలాజీ జిల్లా కలెక్టరేట్ ను పద్మావతి నిలయంలో ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. అయితే పిటిషనర్ హైకోర్టు ధర్మాసనం తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఆ జిల్లాలో ఉత్కంఠత నెలకొంది.