రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా దూకుడుగా వ్యవహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మరో పక్క ఉద్యోగ సంఘాలు ఎన్నికలను నిర్వహించలేమని అంటున్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ మాత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలకు సహకరించకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఉద్యోగులకు నిమ్మగడ్డ హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీం కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పుఎం ఇచ్చింది. కాకపోతే నోటిఫికేషన్ సమయంలో నిమ్మగడ్డ చెప్పిన ఆసక్తికరమైన విషయాలే ఎన్నికలకు బ్రేక్ పడేలా చేస్తాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలోని 3 లక్షల మంది కొత్త ఓటర్ల రూపంలో కొన్ని చిక్కులు రాబోతున్నాయి.
వాస్తవానికి 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని నిమ్మగడ్డ స్వయంగా చెప్పారు.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఓటర్ల జాబితా ఇవ్వడంలో విఫలం అవ్వడం వల్ల, ఎన్నికల సంఘానికి సహకరించకపోవడం కారణంగా 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అలా చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ అదే సమయంలో పాత జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడం వల్ల దాదాపు 3.6 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయారని కూడా చెప్పారు నిమ్మగడ్డ. ఇప్పుడు ఇదే పాయింట్ అధికార పార్టీకి అస్త్రంగా మారింది. కొందరు ఇప్పటికే ఈ అంశాన్ని ఉదహరిస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ నూ దాఖలు చేశారు. నిమ్మగడ్డ చెప్పిన ఈ అంశమే ఇప్పుడు ఎన్నికలకు బ్రేక్ వేసేందుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహణ.. నోటిఫికేషన్ అంశాలే చూసిన కోర్టులకు ఇప్పుడు కొత్త ఓటర్ల రూపంలో మెలిక వచ్చింది.
ప్రభుత్వానికి, ఎన్నికల సంఘంకు మద్య ఏర్పడిన వివాదం కారణంగా తామెందుకు ఓటు హక్కు కోల్పోవాలని పేర్కొంటూ పిటిషన్ లు దాఖలు చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. సోమవారం ఓ న్యాయవాది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లు హైకోర్టులో బుధవారం విచారణకు రానున్నాయి. మరో పక్క ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరారు.