ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగు పడి నలుగురు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని లింగంపాడు మండలం బోగోలులో ఈ విషాదం జరిగింది. జామాయిల్ తోటలో పని చేసేందుకు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుండి 30 మంది కూలీలు బోగోలు వచ్చారు. వీరు నిద్రలో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో కూలీలు పరుగులు తీశారు. పిడుగు పాటుకు నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పడిన వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
మృతులు వేణు (19), కొండబాబు (35), ధర్మరాజు (25), రాజు (28) లుగా గుర్తించారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. గ్రామానికి చెందిన నలుగురు కూలీలు మృతి చెందడంతో అన్నవరం గ్రామంలో విషాదఛ్చాయలు నెలకొన్నాయి. సైక్లోన్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.