TRS: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ షర్మిల హాట్ టాపిక్. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైయస్ షర్మిల ఈ మేరకు వడివడిగా ముందుకు సాగుతున్నారు. ఖమ్మంలో సభ సైతం నిర్వహించారు. తన వాణిని వినిపించారు. అయితే, దీనిపై సహజంగానే ఎదురుదాడి జరుగుతోంది. అయితే, ఇందులో ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ ముందు వరుసలో ఉండటం గమనార్హం.
టార్గెట్ షర్మిల…
ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా బీజేపీ నేతలు వైఎస్ షర్మిల పై స్పందిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ షర్మిల కొత్త పార్టీ పెట్టుకొనే హక్కు ఉందని తెలిపారు. అయితే, ప్రజల ఆదరణ పొందడం అనేది ముఖ్యమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సీనియర్ నేత ఎన్వివిఎస్ ప్రభాకర్ స్పందిస్తూ షర్మిల చెప్తున్న రాజన్న రాజ్యం అంటే దోచుకోవడం, దాచుకోవడం అని ఎద్దేవా చేశారు. సిస్టర్ షర్మిల ప్రసంగం కేసీఆర్ కనుసన్నల్లో తయారైందని విమర్శించారు. కల్వకుంట్ల దర్శకత్వంలోనే షర్మిల కార్యక్రమాలు నడుస్తున్నాయని బీజేపీ నేత ఆరోపించారు.
కేసీఆర్ టీం ఏం చెప్తోందంటే…
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు మొదలు పెట్టాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే హైదరాబాద్లో అల్లర్లు సృష్టించి.. ప్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించారో… వాళ్లే ఇవాళ పార్టీని స్థాపిస్తాం అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గడీల పాలన లేదని గడిల పాలన పులివెందులలో ఉందన్నారు. దుర్బుద్ధితో తెలంగాణను దోచుకునేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకుస్తున్నాయని అన్నారు. ప్రశ్నిస్తా అంటున్న వైయస్ షర్మిల ముందుగా ఏపీ సీయం జగన్ను ప్రశ్నించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.