TRS: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం హీట్ పుట్టిస్తూనే ఉంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన గళం వినిపించారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ సమావేశాలను బహిష్కరించి వచ్చేశారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై అమీతుమీ తేల్చుకునేందుకు కేసిఆర్ సిద్ధమైయ్యారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రైతు బంధు, దళిత బంధు కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్న కేసిఆర్.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసిఆర్ సూచనల మేరకు శనివారం టీఆర్ఎస్ మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ బృందంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుతో పాటు పార్టీ ఎంపీలు ఉన్నారు.
TRS: రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
వానాకాలంలో అదనపు కోటా ధాన్యం కొనుగోలు చేయాలని వారు కేంద్రంపై ఒత్తడి చేయనున్నారు. ఆది, సోమవారాల్లో కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి మోడీ తో భేటీకి ఈ బృందం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పీఎం, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ లు కోరారు. ఖరీఫ్ సీజన్ లో సీజన్ లో పండే వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని స్పష్టత కోరనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ముంబాయిలో ఉన్నారు. రేపు ఆయన ఢిల్లీకి రానున్నారు. రేపు ఆయన ఢిల్లీకి వచ్చిన వెంటనే తెలంగాణ మంత్రులు, ఎంపీలు కలవనున్నారు. మరో పక్క 20వ తేదీ సోమవారం కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కేసిఆర్ పిలుపు ఇచ్చారు.