KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీజేపీ మరో కొత్త విధానంలో టార్గెట్ చేసిందా? వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీనేతల్లో కొత్త సందేహం మొదలైంది. బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో హైదరాబాద్ లింక్లు సంచలనం రేపుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా? అని టీఆర్ఎస్ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.
అసలేం జరుగుతోంది?
బెంగళూరులో కొద్దిరోజుల క్రితం పట్టుబడిన నైజీరియన్స్ ను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత శంకర్ గౌడ్తో కలిసి కలహర్ రెడ్డి, సందీప్.. డ్రగ్స్ దందా సాగించినట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న పబ్లు, హోటళ్లకు హైదరాబాద్కు చెందిన సందీప్, కలహర్ రెడ్డి అనే వ్యాపారవేత్తలు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు.. ఇక, ఈ కేసులో ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రచారంలో ఉండగా.. ఎమ్మెల్యేల ఆర్డర్ మేరకు కొకైన్ను చాలా సార్లు పంపినట్టు కూడా పోలీసుల విచారణలో సందీప్ బయటపెట్టినట్టుగా చెబుతున్నారు.
బీజేపీ ఇరికిస్తోందా?
అయితే, ఈ ప్రచారంపై టీఆర్ఎస్ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు చేస్తున్నాయి. బెంగళూరు డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందనే కావాలనే చేస్తున్నారని అంటున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కావాలనే తమ పార్టీని టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో మరి!