దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక బీజేపీ నేతలకు, న్యాయవాదులకు విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఇప్పుడు తాజాగా ఏపికి చెందిన వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజుకు నోటీసులు అందించినట్లుగా తెలుస్తొంది. రఘురామకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో విచారణకు హజరుకావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది.
రఘురామ కృష్ణంరాజు అధికారికంగా వైసీపీ ఎంపిగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నిందితులకు ఆర్ధికరమైన తోడ్పాటునకు ఏమైనా హామీ ఇచ్చారా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉంటుంది. ఈ కేసులో అనూహ్యంగా రఘురామ కృష్ణంరాజు పేరు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ నేతలపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తున్నారు. అధికార వైసీపీపై నిత్యం ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలియడంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.