TTD : హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారిక ప్రకటన చేసింది. సప్తగిరుల్లోని ఆంజనాద్రియే హనుమంతుడి జన్మస్థానమని టీడీపీ వెల్లడించింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో ఆంజనేయుడు జన్మించినట్లు జతీయ సంస్కృత వర్శిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ వెల్లడించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంజనేయ జన్మస్థలంపై జరిపిన అధ్యయన వివరాలను ఆయన వివరించారు.
ఆంజనేయుడి జన్మస్థలంపై అధ్యయనానికి ఆచార్య మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకర నారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటి డైరెక్టర్ విజయకుమార్ సభ్యులుగా టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ కన్వీనర్గా టీటీడీ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ ఆంజనేయుడు జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అధ్యయనం చేసిందని చెప్పారు. హనుమ జన్మస్థానం సంకల్పంగా తీసుకుని శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలను సేకరించామని తెలిపారు. వెంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయన్నారు. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచారనీ, అంజనాదేవికి తపోవనంలో హనుమ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయన్నారు. సూర్య బింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరారని అన్నారు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని చెబుతున్నాయన్నారు. జాపాలీ తీర్థమే హనుమ జన్మస్థలంగా ప్రకటిస్తున్నామన్నారు. హంపీ విజయనగరం అంజనాద్రి కాదనీ, వాలి ఏలిన కిష్కింద కాబట్టి వానర సైన్యం ఆనవాళ్లు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. నాసిక్, జార్ఘండ్, గుజరాత్, మహారాష్ట్ర ఇవేమీ ఆంజనాద్రి కావని స్పష్టం చేశారు. చత్తీస్గడ్, నాసిక్ పరిశోధకులు సహా అందరికీ దీన్ని స్పష్టం చేస్తున్నామన్నారు. 12,13 శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉన్నదనీ, అన్నమయ్య కీర్తనల్లోనూ వేంకటాచలాన్ని ఆంజనాద్రిగా వర్ణించారని మురళీధర శర్మ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఇఒ జవహార్ రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయుడి జన్మస్థలం శోధించాలని తనకు వచ్చిన ఆలోచన దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. శ్రీవారి కృపతో ప్రయత్నం జరిగిందని అన్నారు. ప్రస్తుతం బుక్ లెట్ మాత్రమే విడుదల చేస్తున్నామనీ, సమగ్ర పుస్తకం రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఇఒ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చ జరగవచ్చనీ, కానీ దైవ నిర్ణయం అయితే ఎలాంటి వివాదాలు రావని భావిస్తున్నానన్నారు.
కాగా హనుమజ్జయంతిపై పిహెచ్డీ చేసిన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన రిటైర్డ్ సంస్కృత అధ్యాపకులు, హనుమత్ ఉపాసకులు అన్నదానం చిదంబర శాస్త్రి 1972లోనే అధ్యయనం చేసి తిరుమలలోని అంజనాద్రియే హనుమంతుడి జన్మస్థలం అని పలు ఆధారాలను సేకరించారు. అనంతరం తన అధ్యయన నివేదికలను టీటీడీకి అందించారు. అదే విధంగా అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించాలని కోరుతూ 1980 నుండి 1999 వరకూ సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించి అప్పటి టీటీడీ ఇఒ వినాయకరావుకు పంపించారు. ఇప్పుడు టీటీడీ అంజనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా అధికారికంగా ప్రకటించడంతో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ తన కృషి ఫలించిందన్నారు.