TTD: టీటీడీ పాలకమండలిలో నేరచరితుల అంశంలో కోర్టు తీర్పుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల్లో నేరచరిత్ర గల వారు ఉన్నారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీ బోర్డులో నేరచరిత్ర గల వారికి స్థానం కల్పించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 19న ఈ పిటిషన్ పై విచారణ జరిపి అదే రోజు తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. అందరినీ కాకపోయనా కొందరిని అయినా తొలగించాలని హైకోర్టు చెప్పింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పుని పరిశీలించి ధర్మాసనం ఇచ్చిన సూచనల మేరకు పాలకమండలిలో మార్పులు చేర్పులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు వైవీ.
TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
టీటీడీలోని 5518 మంది ఉద్యోగులకు వడమాలపేట సమీపంలో 300 ఎకరాల్లో ఇంటి స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన రూ.61 కోట్ల 63 లక్షల డీడీని నేడు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తో కలిసి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. టీటీడీ ఉద్యోగుల 30 ఏళ్ల కల సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిదని ఈ సందర్భంగా వైవీ అన్నారు. మూడు నెలల్లో టీటీడీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ జరుగుతోందన్నారు.